top of page

విద్యాశాఖలో చిత్రం భళారే విచిత్రం

Writer's picture: AP Teachers TVAP Teachers TV

విద్యాశాఖలో భళారే విచిత్రం


ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తి విద్యా శాఖ నుంచి నిష్క్రమిస్తే ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకడతాయని, ఉపాధ్యాయులు కొన్ని నిముషాల పాటైనా ఆక్సిజన్ పీల్చుకోవచ్చని అందరూ భావించారు. పాఠశాలల్లో విద్యాబోధన మూడుపూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది భావించారు. అధికారుల మితిమీరిన జోక్యం వల్ల మరుగున పడిన బోధనను తిరిగి కొనసాగించవచ్చని ఉపాధ్యాయ లోకం కళ్ళకు వత్తులు వేసుకుని చూసింది. ఐదు నెలల కిందట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అందరూ ఆదిశగా ఆశపడ్డారు. అయితే పేరుకు ప్రవీణ్ ప్రకాష్ వెళ్ళిపోయాడు కానీ ఆయన నాటిన విత్తనాలు ఇపుడు మొలకెత్తాయి. ఉపాధ్యాయులను వేపుకుతినే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగించడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. గత ప్రభుత్వంలో పురుడుపోసుకున్న యాపులకు తోడు మరిన్ని టపాలు రావడం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలనకు కొత్త నిబంధనలు తీసుకురావడం, ఉపాధ్యాయులకు చట్టబద్ధంగా సంక్రమించిన క్యాజువల్ లీవుల మంజూరులో నిబంధనలు సృష్టించడం, హైస్కూల్ ప్లస్ స్కూళ్ల పని గంటలను హెచ్చించడం, రెసిడెన్షియల్ శిక్షణ, వీటన్నిటికీ తోడు పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాల సమయాన్ని సాయంత్రం 5 గంటల దాకా హెచ్చించటం వంటి తిరోగమన విధానాలు అమలు చేయబోతున్నారు.


ఈనేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాలల పని వేళల్ని పరిశీలిద్దాం! ప్రత్యేకించి దక్షణాది రాష్ట్రాల్లోనే కాకుండా అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో వున్న కేరళలో ఉదయం 9.10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, కొన్ని పాఠశాలలు 10 నుంచి 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 7.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తారు. విరామ సమయం తీసేస్తే అన్ని పాఠశాలల గరిష్ట పని వేళలు ఐదు గంటలు మాత్రమే!


తెలంగాణలో ఉదయం 9 నుంచి 4.15 వరకు నిర్వహిస్తున్నారు.

అలాగే తమిళనాడులో ఉదయం 9.నుంచి సాయంత్రం 4.10 వరకు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో గ్లానీ ఏర్పడకుండా 5 పీరియడ్లకు పరిమితం చేసారు. అంతేకాకుండా ప్రతి పీరియడ్ కు మధ్య 10 నిముషాల విరామం ఇచ్చారు.

కర్ణాటకలో 8 నుంచి 1.30 వరకు, పాఠశాలలు నిర్వహిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 9.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన నిర్వహిస్తున్న ఢిల్లీలో కూడా ఇటువంటి విపరీత ధోరణులు లేవు. ఉపాధ్యాయులను మానసికంగా ఎలా చిందరవందర చేయాలా అనే అత్యుత్సాహం తప్ప బోధనలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ప్రోది చేయాలా అనే లక్ష్యాల కనుచూపు మేరలో కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరిపి పని వత్తిడి తగ్గించడమెలాగనే తార్కిక పునర్విమర్శకు బదులు గొడ్డు చాకిరిని ఎలా చేయించాలనే విధ్వంస పథక రచన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పని వేళలు పెంచడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టడంలోని ఔచిత్యమేమిటి? ఇదొక భేతాళ ప్రశ్న!

మానవ మేధస్సును చిదిమేసే ప్రక్రియ అది. పనివేళల హెచ్చింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తే తద్వారా సాధించదలచుకున్న లక్ష్యాలను చదువు చెప్పే ఉపాధ్యాయులకు మున్ముందు తెలియజెప్పాలి. అలా కాకుండా ఒక రహస్య అజెండాతో ముందుకెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పాఠశాల పని వేళలు ఎలా ఉండాలనేది విద్యార్థుల్లో అభ్యసన సంసిద్ధత, మానసిక పరిపక్వత, స్థానిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రజల జీవన విధానం వంటి అనేక అంశాలు ప్రతిక్షేపిస్తాయి. 70 శాతానికి పైబడి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రామాణికంగా తీసుకొని ప్రయోగాలు చేయాలి తప్ప అన్ని వసతులు కలిగిన పట్టణ ప్రాంతాలను బేరీజు వేయకూడదు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో తీవ్ర మానసిక వత్తిడి వల్ల విజ్ఞానం సన్నగిల్లి వస్తున్న అత్తెసరు ఫలితాలకు విరుగుడు కనుక్కోవాలి. పరిశోధన, విశ్లేషణ ఉత్తమ ఫలితాలకు మార్గం సుగమం చేస్తాయి తప్ప ఉపాధ్యాయులను చాకిరేవులో ఏకి పారేస్తే సాధ్యం కాదు. ఏడున్నర దశాబ్దాల కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితిని విద్యారంగం చవి చూడలేదు. ఇదొక అప్రకటిత ఎమర్జెన్సీ. ఉపాధ్యాయులపై ముప్పేట దాడి. అనుకూలమైన బోధనా సమయాన్ని యాపుల నిర్వహణకు, ట్రెయినింగులకు కుదువ బెట్టి విద్యా బోధనను కుంగదీసే వ్యవహారానికి మంగళ పడాల్సిన అవసరం వుంది.


మీదు మిక్కిలి ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాలకు సెలవు తీసుకునే అవకాశాన్ని కూడా అధికారుల చెప్పుచేతల్లోకి తీసుకొంటున్నారు. ఉపాధ్యాయుడు కూడా ఒక సంఘజీవి. వారికి భౌతిక అవసరాలుంటాయి. వారిలో కూడా చీమూ నెత్తురు ప్రవహిస్తుంటుంది. వారికి కుటుంబాలుంటాయి. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం, తకు జ్వరమో, తలనొప్పి వచ్చినా సెలవు వచ్చినా సెలవు పెట్టుకోవడానికి అధికారుల కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో పాఠశాల లేదా మండలం యూనిట్ గా తీసుకున్నపుడు 10 శాతానికి మించి సెలవు మంజురుచేయవద్దని ఆదేశించారు. మెడ మీద తల వుండే వారు చెబుతారా ఇలా. ఉన్నత స్థానాల్లో వున్న వారు చట్టంతో పాటు మానవేయకోణంలోనూ ఆలోచించాలి. భౌతిక అవసరాలు ఎవరికీ చెప్పి రావు. అందుకోసమే ఆకస్మిక సెలవు (క్యాజువల్ లీవ్). అలాగని ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా పాఠశాలలకు ఎగనామం పెట్టరు కదా! మరి సెలవు హక్కు కాదనడం ఏంటి? ఉపాధ్యాయులకు కనీస మానవ హక్కులు కూడా వర్తించకుండా ప్రతిబంధకాలు సృష్టించడమేంటి?? వ్యవస్థలను బలోపేతం చేసే సంస్కరణలను స్వాగతించాల్సిందే! కానీ అవి మొదటికి మోసం తెచ్చేవి కాకూడదు. అసంబద్ధ విధానాలకు స్వస్తి పలికి ఆచరణాత్మక, తులనాత్మక శాస్త్రీయ విధానాల బాటలో ముందుకెళ్లడం సర్వత్రా శిరోధార్యం!


- మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర నాయకులు.

 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page